సాహిత్య ప్రస్థానం

స్కూల్ లైబ్రరీలో రష్యన్ మరియు బెంగాలీ అనువాదాలు, కుప్రీన్, టాల్‌స్టాయ్, తుర్గనేవ్ రచనలు చదివి, చిన్న వయసులోనే సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించారు. విద్యార్థి దశలోనే పల్లె జీవనంపై “మట్టిపాట” పేరుతో ఒక శతకం రచించారు. అది వారి  సాహిత్య పయనం మొదటి అడుగు. 

పదవ తరగతిలో ఉన్నప్పుడు బాలల మాసపత్రిక నిర్వహించిన నవల పోటీలో 120 పేజీల “ఊరు మారింది” అనే నవల రాసి పంపారు. తర్వాత “సినీయాక్టర్‌ని” అనే నవలతో తన సృజనాత్మక ప్రతిభను మరింతగా చూపించారు. 1983లో “పాఠశాల” అనే విద్యార్థి పత్రికకు శ్రీనాథ మహాకవిపై రాసిన వ్యాసానికి మొదటి బహుమతి లభించింది. ఆటలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో చురుకుగా పాల్గొంటూ తొమ్మిదో తరగతిలో విద్యార్థి సంఘ కార్యదర్శిగా, పదో తరగతిలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇంటర్ చదువుతున్న సమయంలో యువవాణి కార్యక్రమంలో కవిత్వం చదవడానికి అవకాశం పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన పురాణ ప్రబోధ పరీక్షలో జిల్లా ఫస్ట్ ర్యాంకుతో రజత పతకం అందుకున్నారు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు రచించిన “పగిలిన గుండెలు” నవల, ప్రజాపోరాటం సాయంకాల దినపత్రికలో రెండున్నర నెలలపాటు డైలీ సీరియల్‌గా ప్రచురించబడింది. ఈ సాహిత్య యాత్రలో, కవి, రచయిత, విమర్శకుడిగా ఆయన సాధించిన స్థానం తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ఒక గర్వకారణం.

తెలంగాణ రుబాయిలు, హైదరాబాద్ విషాదం, కొత్త పలక అనే విభిన్నమైన సాహిత్య సృజనలతో ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్యం పై తనదైన విశేషముద్రవేశాడు. కవిగా వచన కవిత్వాన్ని రుబాయిలను, చందోబద్ధ పద్యాలను సాధికారికంగా రాయగలిగిన అరుదైన తెలుగు కవులలో ఏనుగు నరసింహారెడ్డి ఒకడు. ఆయన రాసిన మట్టి పాట శతకం పల్లె జీవిత దైన్యాన్ని కళ్ళకు కట్టడంతో దేశపతి శ్రీనివాస్ స్వరంలో దీర్ఘ గేయంగా వచ్చింది. ఏనుగు నరసింహారెడ్డి రాసిన తెలంగాణ రుబాయిలను అనేక మంది ఔత్సాహిక గాయకులు తమదైన స్వరంలో పాడి వీడియోలు అద్ది యూట్యూబ్లో పదిలపరుచుకున్నారు. చిన్న కవితల సంపుటిగా తీసుకువచ్చిన పూల పూల వాన ను తెలుగు సమాజం ఎంతగానో ఆదరించింది.

×

దోరవేటి

బాష సరళం; భావం ఉదృతం; ధార అనువద్యం; సందేశం అలోచనాత్మకం. నా ఎరుకలో ఇటువంటి శతకం లేదు. నరసింహారెడ్డి గారికి ఉత్తమ సాహిత్యానికి, శతక పద్యానికి ఈ పుస్తకం చిరునామా గా నిలబడగలదనడం లో ఏ విధమైన సందేహం లేదు.

నెల్లుట్ల రమాదేవి

మాయ మాటల హామీల మర్మ మెరిగి గుర్తు లేకుండా ఓట్లేట్ల గుద్దుతావు ? ఓరి ఎంకన్న ! దోస్తుగా ! ఒర్లుబోతు ! ఒక్క మాటన్న వినవార ! తిక్కలోడ ! అన్న ముక్తాయింపును అచ్చమైన తెలంగాణా మాండలికంలో పలికించడమే ఈ శతకం ప్రత్యేకత.

డా. చీదెళ్ళ సీతాలక్ష్మి

అచ్చమైన తెలంగాణ యాసలో, వ్యావహారిక బాషలో నిత్య వ్యవహారంలోని పదాలతో స్వార్ధపూరిత రాజకీయ నాయకుల మాయ మాటలను నమ్మి వారి బూటకపు వలలో చిక్కిన ప్రజలను మీలుకోలపడానికి చేసిన కవితా ప్రయాణం చాలా బాగుంది.

చందా రాములు

మీ పంచతంత్రాలు ఒకప్పుడు దేవి ప్రియ రాసిన గరీబు గీతాలను గుర్తుకు తెస్తున్నాయి. మీ కవితలు సమాజ పోకడకు దర్పణాలు

అవధాని అవుసుల భానుప్రకాశ్

జర్ర వినువంచు రచియించి జగతికొసగే !
దివ్య నరసింహ రెడ్డియౌ భవ్యుడతడు !
పద్య రచనలో కొంగ్రొత్త పధము నడిచె,
సిత్తరమ్మగు పద్యాలు చెలువమెలికే !!

డా. కాచాపురం దుర్గాదేవి

వచన కవిత్వం లో కంటే పద్యం విసుర్ల ద్వారా పాఠకులకు ఉత్తేజితుల్ని చేయగలనని విశ్వసించడం అయన నమ్మకం.

మోతుకూరు నరహరి

ప్రాచీన కవులలో సీస పద్యానికి శ్రీనాధ మహాకవి పెట్టింది పేరు. ఆధునికులలో ఈ ప్రకియలో రాస్తున్న అరుదైన కవులలో నరసన్న అతి ముఖ్యుడు.

డా. మండల స్వామి

పాడుకోవడానికి వీలైన సీస పద్య ప్రక్రియ లో కొత్త వస్తువును ఎంచుకొన్నారు. సృజనకు శాస్వ తత్వాన్ని ఆపాదించారు. నాలుగు పాదాల మకుటం ప్రత్యెక ఆకర్షణ

ప్రేమ్ సాగర్ రావు

నేటి కుళ్ళు రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే ఏనుగు నరసింహారావు గారి తపన ప్రతీ కవితలో ఒక ఆవేదన రూపం లో కనిపిస్తుంది

డా. సి హెచ్ . సుశీల

ఈ జగత్తు, జీవితం, మనిషి అంతరంగం – ఇవన్నీ ప్రశ్నలతో నిండినవి. ఆ ప్రశ్నలకు సమాధానాలను కవిత్వ భాషలో, ముఖ్యంగా రుబాయి వంటి సంక్షిప్త ఛందస్సులో చెప్పడం సాహిత్యపరంగా గొప్ప సవాలు. ఆ సవాలును సమర్థంగా ఎదుర్కొన్న రచనగా డా. ఏనుగు నరసింహారెడ్డి గారి “తెలంగాణ రుబాయిలు” నిలుస్తుంది.

Scroll to Top